దుబ్బాక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.. టెన్షన్ కూడా పీక్స్

Dubbaka By Election Results Tomorrow. దుబ్బాక ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపి ఉంటారోనని తెలంగాణలో సర్వత్రా ఉత్కంఠ

By Medi Samrat  Published on  9 Nov 2020 12:52 PM GMT
దుబ్బాక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.. టెన్షన్ కూడా పీక్స్

దుబ్బాక ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపి ఉంటారోనని తెలంగాణలో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. నవంబర్ 10న ఫలితాలు వస్తూ ఉండడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తీ అయ్యాయి. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది.దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.

10వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు అవ్వనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. ఈ ప్రక్రియలో14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 రౌండ్లలో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్‌ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ చేస్తూ లెక్కింపు చేపట్టనున్నారు. పాసులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఇందూర్ కాలేజి వరకు అనుమతి ఇస్తున్నారు.

ఇక ఇటీవల వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అన్న క్లారిటీ లేకుండా పోయింది. టీఆర్ఎస్ తరపున సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల కోసం ఇంకొక్క రోజు వరకూ ఎదురుచూడాల్సి ఉంది.

ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరా ఎగ్జిట్ పోల్స్:

తొలి స్థానం: టీఆర్ఎస్ (48.72 శాతం)

రెండో స్థానం: బీజేపీ (44.64 శాతం)

మూడో స్థానం: కాంగ్రెస్ (6.12 శాతం)

థర్డ్ విజన్ రీజర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) ఎగ్జిట్ పోల్స్:

తొలి స్థానం: టీఆర్ఎస్ (51-54 శాతం)

రెండో స్థానం: బీజేపీ (33-36 శాతం)

మూడో స్థానం: కాంగ్రెస్ (8-11 శాతం)

మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్:

తొలి స్థానం: బీజేపీ (51.82 శాతం)

రెండో స్థానం: టీఆర్ఎస్ (35.67 శాతం)

మూడో స్థానం: కాంగ్రెస్ (12.15 శాతం)

పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్:

తొలి స్థానం: బీజేపీ (47 శాతం)

రెండో స్థానం: టీఆర్ఎస్ (38 శాతం)

మూడో స్థానం: కాంగ్రెస్ (13 శాతం).


Next Story