దేశంలో పలు రాష్ట్రాల్లో బాణాసంచాపై పూర్తి నిషేధం

Firecrackers ban I దీపావళి పండగ వచ్చేస్తోంది. టపాసులతో మోత మోగిపోతుంది. దీంతో కాలుష్యం కూడా బాగానే అవుతుంది.

By సుభాష్  Published on  9 Nov 2020 10:09 AM GMT
దేశంలో పలు రాష్ట్రాల్లో బాణాసంచాపై పూర్తి నిషేధం

దీపావళి పండగ వచ్చేస్తోంది. టపాసులతో మోత మోగిపోతుంది. దీంతో కాలుష్యం కూడా బాగానే అవుతుంది. ఇక దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తం అయ్యాయి. దీపావళి బాణాసంచాతో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబర్‌ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్‌ 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునరల్‌ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేకాకుండా గత ఏడాది నవంబర్‌లో గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆ ప్రాంతాల్లో మాత్రమే టపాసులు విక్రయించాలి

ఇక గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. దీపావళి, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో బాణసంచా కాల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంతో కోవిడ్‌ వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల బాణాసంచాలపై నిషేధం విధించింది. ఇకదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో హరిత టపాసులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.




Next Story