విషాదం.. రోడ్డుప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్ మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  28 April 2024 7:30 AM GMT
kamareddy, road accident, head constable, death,

విషాదం.. రోడ్డుప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కొద్ది రోజుల పాటు ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్‌గౌడ్‌ ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు.

శ్రీనివాస్‌గౌడ్ సొంత గ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌. కాగా.. గతంలోనే శ్రీనివాస్‌గౌడ్ కుంటుంబం కామారెడ్డిలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌గౌడ్‌ 1995 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. శనివారం రాత్రి తాడ్వాయి వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్‌గౌడ్‌ అకాల మరణం చెందారు. శనివారం అర్ధరాత్రి డ్యూటీలో భాగంగా కామారెడ్డి నుంచి తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌కు కారులో వెళ్తుండగా రోడ్డు పక్కనే ఆగివున్న లారీని ఢీకొట్టాడు. దాంతో.. శ్రీనివాస్‌ తలకు తీవ్ర గాయం అయ్యింది. ఇక ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెడ్‌ కానిస్టేబుల్ తల, చాతికి బలమైన గాయాలు కావడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. మార్గ మధ్యలోనే శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీనివాస్‌గౌడ్‌ గతంలో గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో కూడా హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక హెడ్‌ కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కాగా.. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌గౌడ్ మృతిపట్ల ఎల్లారెడ్డిపేట రూరల్‌ సీఐ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎస్‌ఐ, ఇతర పోలీసు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్‌గౌడ్‌ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story