పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం కృషి చేస్తా: ముద్రగడ కూతురు  

పవన్ కల్యాణ్‌ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు.

By Srikanth Gundamalla  Published on  3 May 2024 8:30 AM GMT
andhra pradesh, politics, mudragada, daughter,  pawan ,

 పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం కృషి చేస్తా: ముద్రగడ కూతురు  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. కేవలం పవన్ కల్యాణ్‌ను తిట్టించేందుకే సీఎం జగన్‌.. ముద్రగడ పద్మనాభాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ముద్రగడను జగన్ పట్టించుకోరని అన్నారు. అయితే.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ విజయం కోసం తాను కృషి చేస్తానని ఈ మేరకు క్రాంతి వెల్లడించారు.

మరోవైపు ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌ గురించి చేసిన కామెంట్స్‌ను కూడా క్రాంతి ఖండించారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటాననీ.. ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం సరికాదన్నారు. ముద్రగడ ప్రకటనపై ఆయన ఫాలోవర్స్‌ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. అంతేకాదు..తన తండ్రి ఇలాంటి కామెంట్స్‌ చేయడం వెనుక కాన్సెప్ట్‌ ఏంటో కూడా తనకు అర్థం కావట్లేదన్నారు.

పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారని ముద్రగడ కూతురు క్రాంతి చెప్పారు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడకూడదని ఈ సందర్భంగా చెప్పారు. పవన్‌ను తిట్టించేందుకు మాత్రమే ముద్రగడను జగన్‌ వాడుతున్నారంటూ విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత ఎటూ కాకుండా వదిలేయడం పక్కా అని ముద్రగడ కూతురు క్రాంతి అన్నారు.

తాజాగా కూతురు క్రాంతి చేసిన కామెంట్స్‌పై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురు పెళ్లి అయిపోయిందనీ.. తన కూతురుతో కొంతమంది తిట్టించారని ముద్రగడ అన్నారు. ఇది బాధాకరమని చెప్పారు. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. వైసీపీలో తాను పదవుల కోసం చేరలేదని చెప్పాడు. ఒకసారి పార్టీలో చేరిన తర్వాత పక్క చూపులు చూడనని ముద్రగడ వెల్లడించారు. ఎవరెన్ని అనుకున్నా కూడా జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని దీమాగా చెప్పారు. తాను వైసీపీకి సేవకుడిగా పనిచేస్తాను కానీ.. పదవులు అడగనని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

Next Story