రాహుల్‌ మీటింగ్‌లో 30వేల కుర్చీలుంటే.. 3వేల మంది రాలేదు: హరీశ్‌రావు

సరూర్‌నగర్‌లో రాహుల్‌గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ఫెయిల్‌ అయ్యిందని విమర్శించారు హరీశ్‌రావు.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 8:28 AM GMT
brs, harish rao, comments,  congress govt, telangana,

 రాహుల్‌ మీటింగ్‌లో 30వేల కుర్చీలుంటే.. 3వేల మంది రాలేదు: హరీశ్‌రావు

సరూర్‌నగర్‌లో రాహుల్‌గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ఫెయిల్‌ అయ్యిందని విమర్శించారు బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. మీటింగ్‌ కోసం వారి పార్టీ నాయకులు 30వేల కుర్చీలు ఏర్పాటు చేశారనీ.. కానీ 3వేల మంది కూడా రాలేదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మీదకు వెళ్లి ప్రజలను సభలో కూర్చోవాలని బతిమాలినా ఎవరూ రాలేదని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ తరఫున హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగానే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీపై విమర్శలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నో హామీలు ఇచ్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆ హామీలు అన్నీ ఏమయ్యాయని నిలదీశారు. ప్రియాంక గాంధీ హుస్నాబాద్‌ వచ్చినప్పుడు కాంగ్రెస్‌ గెలిస్తే మెడికల్‌ కాలేజ్‌ ఇస్తామని చెప్పారనీ.. అలాగే రాహుల్‌గాంధీ వచ్చి మహిళల అకౌంట్లలో రూ.2500 జమ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ హామీలను నెరవేర్చలేదని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల పార్టీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని చెప్పారు హరీశ్‌రావు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారనీ.. కానీ ఐదు నెలలు అవుతున్నా ఎందుకు ఆ హామీని నెరవేర్చట్లేదని అడిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందించామని చెప్పారు. ఇలా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందో లేదో రాష్ట్రంలో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. నిరుద్యోగులు, రైతులను కూడా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయనీ.. తులం బంగారం ఇస్తామని చెప్పారు కానీ ఊసే ఎత్తడం లేదన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతు పెట్టుబడి ఎప్పుడిస్తారని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Next Story